Parliament | మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలోనే దాదాపు 400 మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహించాలన్న విషయంలో అధికారులు, ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడానికే మొగ్గు చూపడం గమనార్హం. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం తలపోసిందని ఓ అధికారి తెలిపారు. అయితే ఉభయ సభలూ షిఫ్టుల మాదిరిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. లోక్సభ, రాజ్యసభ సమావేశాలను షిఫ్టుల రూపంలో నిర్వహించాలని పార్లమెంట్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను పంపిందని అధికారులు పేర్కొంటున్నారు.
‘పార్లమెంట్ మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనలను గనక ప్రభుత్వం అంగీకరిస్తే ఉభయ సభలూ షిఫ్టుల రూపంలో నడుస్తాయి. మొదటి షిఫ్టులో రాజ్యసభ నడుస్తుందని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ నడుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకూ లోక్సభ నడుస్తుంది. అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టే రోజు మాత్రం లోక్సభ మొదటి షిఫ్టులో నడుస్తుంది. ఈ సమావేశాల్లో ఎంపీలందరూ భౌతిక దూరం పాటిస్తూ కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు’ అని ఓ అధికారి పేర్కొన్నారు.
పార్లమెంట్లోని 400 మంది సిబ్బందికి కరోనా సోకడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అప్రమత్తమయ్యారు. ఆ సిబ్బంది యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే తీరుపై అధికారులతో సమాలోచనలు జరిపారు. 50 శాతం సిబ్బందితో పనిచేస్తూ, మిగతా వారికి వర్క్ఫ్రం హోం వెసులు బాటు కల్పిస్తున్నారు.