న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. తమ విధులకు ప్రాధాన్యతనిస్తూ, భారతదేశ హక్కులను సాధించడంలో సహాయపడిన లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధులకు నమస్కరిస్తున్నానని అన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించిన 75 సంవత్సరాలలో భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో దోహదపడిన వ్యక్తులను కూడా గౌరవంగా స్మరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుండి గణతంత్ర దినోత్సవ వేడుకలను నేతాజీ జయంతి అయిన జనవరి 23 నుండి ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. దేశం సురక్షితమైన భవిష్యత్తు కోసం గతాన్ని గుర్తుంచుకోవడం, దాని నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యమని ప్రభుత్వం విశ్వసిస్తుందని చెప్పారు.
కాగా, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాల మొదటి రెండు రోజులలో పార్లమెంట్ ఉభయ సభలలో జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు.
మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సెషన్ మొదటి భాగం జనవరి 31 నుండి ఫిబ్రవరి 11 వరకు జరుగుతుంది. ఆ తర్వాత వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులను పరిశీలించడానికి విరామం ఉంటుంది. రెండో సెషన్ మార్చి 14న పునఃప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తుంది. సెషన్లోని మొదటి భాగంలో 10 సిట్టింగ్లు, రెండవ భాగంలో 19 సిట్టింగ్లను షెడ్యూల్ చేశారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.