Budget 2022 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ రెండు రోజులు జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దయ్యాయి. ఈ నెల 31న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్కు సమర్పిస్తారు. ఈ నేపథ్యంలో తొలి రెండు రోజులు పార్లమెంట్ ఉభయసభల్లోనూ జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దు చేసినట్లు పార్లమెంట్ బులెటిన్లో తెలిపింది.
సభ్యులేదైనా అత్యవసర అంశాలను లేవనెత్తాలనుకుంటే రెండో తేదీన జీరో అవర్లో చేపట్టవచ్చునని ఆ బులెటిన్ వివరించింది. ఫిబ్రవరి రెండో తేదీన లేవనెత్తే అంశాలపై మంగళవారం నాడే నోటీసు ఇవ్వాలని తెలిపింది. ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో ఈ-పోర్టల్ ద్వారా గానీ, పార్లమెంటరీ నోటీస్ ఆఫీసులో మాన్యువల్గా గానీ నోటీసు ఇవ్వవచ్చునని వెల్లడించింది.
పార్లమెంటరీ నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజూ క్వశ్చన్ అవర్, జీరో అవర్ 60 నిమిషాలు సాగుతాయి. లోక్సభలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్వశ్చన్ అవర్ దాని కొనసాగింపుగా జీరో అవర్, రాజ్యసభలో 11 గంటల నుంచి 12 గంటల వరకు జీరో అవర్, క్వశ్చన్ అవర్ నిర్వహిస్తారు.
పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో జనవరి 31 ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ వెంటనే పార్లమెంట్లో ఎకనమిక్ సర్వేను ప్రవేశపెడతారు. మంగళవారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పిస్తారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెడతారు.