న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం ఖర్చులు, ఆతిథ్యం, వినోదాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1,024.30 కోట్లు కేటాయించారు. (Union Budget 2025) 2024-25 బడ్జెట్లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే ఇది కొంచెం ఎక్కువే. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర మంత్రుల ఖర్చుల కోసం రూ.619.04 కోట్లు కేటాయించారు. 2024-25లో ఇది రూ.540.95 కోట్లుగా ఉంది. క్యాబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, మాజీ ప్రధానుల జీతాలు, ఇతర భత్యాలు, ప్రయాణ ఖర్చులు, వీవీఐపీల కోసం ప్రత్యేక విమాన ప్రయాణాలు వంటి ఖర్చుల కోసం ఈ నిధులు వినియోగిస్తారు.
కాగా, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్కు 2024-25లో రూ.270.08 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.182.75 కోట్లకు కుదించారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయానికి, జాతీయ పరిశోధనా ఫౌండేషన్ పరిపాలనా ఖర్చులకు రూ.70.12 కోట్లు కేటాయించారు. 2024-25లో రూ.65.72 కోట్లు వినియోగించారు.
మరోవైపు క్యాబినెట్ సెక్రటేరియట్కు రూ.75.68 కోట్లు (2024-25లో రూ.73.98 కోట్లు), ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పరిపాలనా ఖర్చులకు రూ.70.91 కోట్లు (2024-25లో రూ. 65.30 కోట్లు) కేటాయించారు. 2024-25లో మాదిరిగానే ఆతిథ్యం, వినోద ఖర్చుల కోసం ప్రస్తుత బడ్జెట్లో కూడా రూ.4 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే మాజీ గవర్నర్లకు సెక్రటేరియట్ సహాయం చెల్లింపుల కోసం గతంలో మాదిరిగానే రూ.1.80 కోట్లు కేటాయించారు.