Lakshadweep | లక్షద్వీప్తో పాటు భారత్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్రమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్పై స్పందించారు. పర్యాటకానికి ప్రోత్సాహాన్ని అందించేందుకు లక్షద్వీప్తో సహా ఇతర దీవుల్లో పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రా, ఇతర సౌకర్యాల కోసం ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఆర్థిక మంత్రి అన్నారు.
పర్యాటక రంగంలోనే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని సీతారామన్ ప్రకటించారు. పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు. ఇక మూడోసారి బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘జులైలో పూర్తి బడ్జెట్లో వికసిత భారత్ కోసం ప్రభుత్వం ఒక వివరణాత్మక రోడ్మ్యాప్ను అందజేస్తుంది’ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడే వరకు మధ్యంతర బడ్జెట్ ఆర్థిక అవసరాలను తీర్చనున్నది. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది.
బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో కేంద్రమంత్రి కేంద్రం తీసుకువచ్చిన విధానాలు మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సహాయపడతాయన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల భారత్-మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్లో పర్యటించిన తర్వాత మాల్దీవులకు చెందిన మంత్రులు ప్రధానితో పాటు భారత్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘బాయ్కాట్’ మాల్దీవులు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత చాలామంది భారతీయులు, సెలబ్రిటీలు మాల్దీవుల పర్యటనను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లక్షద్వీప్ని సందర్శించాలంటూ పిలుపునిచ్చారు.