Mayawati | ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు స్తబ్దుగా ఉన్న బీఎస్పీ చీఫ్ మాయావతి… ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత యాక్టివ్ అవుతున్నారు. నోటిఫికేషన్ వెలువడ్డ మరుసటి రోజు నుంచే అధికార బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో కొందరు మతాన్ని దుర్వినియోగం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని, ఈ ట్రెండ్కు అడ్డుకట్ట వేయాలని మాయావతి ఎన్నికల సంఘాన్ని కోరింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే కొందరు మతాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతు నడుస్తోందంటూ బీజేపీపై మండిపడ్డారు.
ఈ దుర్వినియోగం ఎన్నికలపై పడుతోందని, ఈ విషయంపైనే దేశం మొత్తం తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. 80 శాతం ప్రజలు వర్సెస్ 20 శాతం ప్రజల మధ్య జరుగతాయంటూ సీఎం యోగి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొనే మాయావతి పై విధంగా స్పందించారు. బీజేపీ పక్షపాత రాజకీయాలు చేస్తోందని, ఇలా చేస్తూ జంగల్ రాజ్ వ్యవస్థను నడుపుతోందని మాయావతి మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో వ్యవస్థలను దుర్వినియోగం చేయకుండా, ఈవీఎంలను చెడగొట్టకుండా సవ్యంగా ఉంటే మాత్రం బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు.