BSP chief : బీఎస్పీ (BSP) జాతీయ అధ్యక్షురాలు (National president) గా మరోసారి మాయావతి (Mayavati) ఎన్నికయ్యారు. బీఎస్పీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జాతీయ స్థాయి ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర పార్టీ నేతలు అందరూ కలిసి ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వెల్లడించింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి మాయావతి వైదొలుగుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేసిన మరుసటి రోజే అమెను మళ్లీ అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం గమనార్హం.
కాగా మాయావతి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. ‘కులవాద మీడియా’ ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, గౌరవనీయులైన కాన్షీరామ్ జీ లాంటి బహుజనుల ఆశయాలను నిర్వీర్యం చేసే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడం కోసం తన చివరి శ్వాస వరకు బీఎస్పీ ఆత్మగౌరవం, ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం కావాలన్నదే తన నిర్ణయమని చెప్పారు.
క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను లేనప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆకాశ్ ఆనంద్ను బీఎస్పీ వారసుడిగా పార్టీ ప్రతిపాదించిందని మాయావతి చెప్పారు. అప్పటి నుంచి ఇలాంటి తప్పుడు వార్తలను కుల మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఇలాంటి ప్రచారాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. గతంలో తనను రాష్ట్రపతిని చేస్తారన్న పుకార్లు కూడా వ్యాపించాయని మాయావతి గుర్తుచేశారు. రాష్ట్రపతి కావడమంటే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడమేనని, కాన్షీరామ్ శిష్యురాలిగా తాను ఆ పదవిని ఎలా స్వీకరిస్తాను..? అని ప్రశ్నించారు.