లక్నో : అసద్ అహ్మద్ ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలని బీఎస్పీ చీఫ్ మాయావతి (Mayawati )గురువారం డిమాండ్ చేశారు. అసద్ అహ్మద్ ఎన్కౌంటర్పై వాస్తవాలు వెలుగులోకి వచ్చేందుకు విచారణ చేపట్టాలని ఆమె కోరారు. అతిక్ అహ్మద్ కుమారుడు, ఇతరుల ఎన్కౌంటర్పై ప్రజల్లో చర్చ జరుగుతున్నదని, వికాస్ దూబే ఘటన పునరావృతమవుతుందన్న భయాందోళన నిజమవుతోందని ప్రజలు భావిస్తున్నారని మాయావతి పేర్కొన్నారు.
ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు ప్రజలకు తెలిసేలా అత్యున్నత స్ధాయి దర్యాప్తు జరిపించడం అవసరమని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ఝాన్సీలో రాజకీయ నేతగా మారిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్, అతడి అనుచరుడు గులాం యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. వీరిద్దరూ ప్రయాగ్రాజ్లో ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.
అసద్, గులాంల తలలపై రూ. ఐదు లక్షల చొప్పున పోలీసులు రివార్డు ప్రకటించారు. డిప్యూటీ ఎస్పీ నవేందు, విమల్ నేతృత్వంలోని యూపీఎస్టీఎఫ్ బృందం ఝాన్సీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో అసద్, గులాంలను మట్టుబెట్టిందని టాస్క్ఫోర్స్ వెల్లడించింది. వీరి వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది.
Read More