చండీగఢ్ : దాయాది పాకిస్థాన్ దుశ్చర్యలను కొనసాగిస్తున్నది. మంగళవారం అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో పాక్ డ్రోన్ కనిపించింది. బీఎస్ఎఫ్ జవాన్లు డ్రోన్లతో కాల్పులు జరిపారు. డ్రోన్లు రెండు పసుపు ప్యాకెట్లను పొలాల్లో జారవిడిచాయి. అయితే, బుధవారం నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో ప్యాకెట్లను గుర్తించగా.. అందులో నాలుగు కిలోల కంటే ఎక్కువ ఆర్డీఎక్స్, పిస్టల్, బాంబు తయారీ వస్తువులను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు.
గురుదాస్పూర్ సెక్టార్లోని పంజ్గారియా ప్రాంతంలో మధ్యాహ్న ఒంటి గంట సమయంలో పాక్ వైపు నుంచి భారత్ వైపు అనుమానాస్పద వస్తువు ఎగురుతున్న శబ్దం వినిపించిందని పారామిలటరీ దళ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ తర్వాత సైనికులు కాల్పులు జరిపారని.. ఆ తర్వాత సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఘగ్గర్ సింఘోక్ గ్రామాల్లో గోధుమ పంట పొలాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో రెండు పసుపు రంగు ప్యాకెట్లు లభ్యమయ్యాయన్నారు. ప్యాకెట్లలో మొదట డ్రగ్స్ ఉండొచ్చని భావించగా.. వాటిని తెరిచి చూడగా.. 4.7 కిలోల ఆర్డీఎక్స్, చైనాలో తయారైన పిస్టల్, రెండు 22 బుల్లెట్స్ మ్యాగజైన్లు, మూడు ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, టైమర్ డివైజ్, డిటోనింగ్ కార్డ్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్లాస్టిక్ పైపులు, ప్యాకింగ్ మెటీరియల్, నగదు సైతం లభించాయి.
అయితే, స్వాధీనం చేసుకున్న వస్తువులతో ఆర్డీఎక్స్తో పని చేసే ఐఈడీలు లేదంటే బాంబులు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో లూథియానా కోర్టులో, ఇటీవల ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్లో గుర్తించినట్లు అధికారి పేర్కొన్నారు. సరిహద్దు కంచెకు దాదాపు 2.7 కి.మీ దూరంలో ఉన్న భారత్ వైపు ప్యాకెట్లను జారవిడిచిన డ్రోన్.. తిరిగి పాకిస్థాన్కు వెళ్లే అవకాశం ఉందని అధికారి చెప్పారు.