జమ్మూకశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దులో భారత గగనతలంలోకి ప్రవేశిస్తున్న పాకిస్తాన్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటన ఆర్ఎస్ పురా సెక్టార్లోని ఆర్నియా ఏరియాలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 4:45 గంటల మధ్య చోటు చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు. జబ్బోవాల్, విక్రమ్ బోర్డర్ ఔట్పోస్టుల వద్ద పాక్ డ్రోన్లను పసిగట్టి తక్షణమే 15 రౌండ్ల కాల్పులు జరిపామని తెలిపారు. ఆ తర్వాత ఆ రెండు డ్రోన్లు, పాక్ గగనతలంపైకి తిరిగి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆ రెండు ఔట్ పోస్టుల వద్ద తనిఖీలు చేశామని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదని స్పష్టం చేశారు. సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.