BRS Party | దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తున్నది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో పార్టీ రోజు రోజుకూ విస్తరిస్తున్నది. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతమవుతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రకు చెందిన మేధావులు, పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్నారు.
మాకు తెలంగాణ మోడల్ పాలన కావాలనే బలమైన ఆకాంక్షతో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం స్వీకరిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన నేతలు మంగళవారం ముఖ్యమంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మేల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులో బీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరించారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పట్టున్న నేతలు బీఆర్ఎస్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మధ్యప్రదేశ్లోని రేవా పార్లమెంట్కు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ బీఆర్ఎస్లో చేరారు.
ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఎస్పీకి చెందిన
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నరేశ్ సింగ్ గుర్జార్, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే ధీరేంద్ర సింగ్, సాత్నా మాజీ జిల్లా పంచాయత్ సభ్యులు విమల బాగ్రి, సర్వజన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, భోపాల్కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్ర సింగ్ బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన మాజీ ఎంపీ బుద్ధసేన్ పటేల్ను బీఆర్ఎస్ మధ్యప్రదేశ్ కో ఆర్డినేటర్గా కేసీఆర్ నియమించారు.
మధ్యప్రదేశ్కు తిరిగి వెళ్లిన తర్వాత ఇప్పటికే ఆసక్తితో ఎదురుచూస్తున్న అక్కడి ప్రజలు, నేతలతో విస్తృత సమావేశమై చర్చించనున్నట్లు నేతలు పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ పాలన కోసం కోసం మధ్యప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారు. త్వరలోనే తిరిగి హైదరాబాద్కు వచ్చి భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతామని చెప్పారు. ఈ సందర్భంగా భోపాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, రావాలంటూ పార్టీ అధినేత కేసీఆర్ను నేతలు ఆహ్వానించారు. వారి వెంట చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర నేతలు ఉన్నారు.