Women’s Reservation Bill | హైదరాబాద్(నమస్తే తెలంగాణ): చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపటం సంతోషంగా ఉన్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో నామా మాట్లాడారు.
బిల్లును 128వ రాజ్యాంగ సవరణను, డీ లిమిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి, 2024 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. 2014 జూన్లో మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్పై తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తుచేశారు. తెలంగాణలో ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెట్పీటీసీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతోపాటు వ్యవసాయ మారెట్ కమిటీ నియామకాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్కు దకుతుందని చెప్పారు.
తాను ఎంపీగా ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అయితే రిజర్వేషన్ అమలు తీరుపై మహిళలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాలయాపన చేస్తే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, మహిళా ఓటర్లను ఆకర్షించడానికి చేశారనే భావించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించారు.