Nama Nageshwar Rao | హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లుతో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ (సవరణ) బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ రెండు బిల్లులపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ లకు సంబంధించి దేశంలో జనగణన కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని నామా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2014, నవంబర్ 29నే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు గుర్తు చేశారు. అప్పటి నుంచి ఈ బిల్లు కేంద్రం వద్దనే పెండింగ్లో ఉందని ఆయన పేరొన్నారు. జమ్మూ కశ్మీర్ బిల్లులను ఆమోదించడం సమర్థనీయమే కానీ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సంబంధించి కేంద్రం వద్ద అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153 కు పెంచాల్సి ఉండగా, ఇంతవరకు పెంచలేదని , ఈ అంశాన్ని త్వరితగతిన తేల్చాలని అన్నారు. అలాగే ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలను 225కి పెంచుతామని అన్నారని నామా పేరొన్నారు..
తెలంగాణలో బీసీలుగా ఉన్న వడ్డెర కులస్తులను ఎస్టీలుగా పరిగణిస్తూ వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని నామా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీరు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా కొనసాగుతున్న అంశాన్ని ఆయన గుర్తు చేశారు. వారి సామాజిక ఆర్థిక అంశాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకోవాలని నామా నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.