బెంగళూరు, అక్టోబర్ 15: సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధినేత దేవెగౌడ అన్నారు. కర్ణాటక రాష్ట్ర తెలంగాణ అసోసియేషన్ (కేఆర్టీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కుమార మక్తళ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు శనివారం ఆయనను కలుసుకొని పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ స్థాపించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. కర్ణాటకలో బీఆర్ఎస్కు తమపార్టీ జేడీఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. కేసీఆర్తో తనకు సుదీర్ఘ అనుబంధం ఉన్నదని దేవెగౌడ గుర్తు చేసుకున్నారు.
అది తనకు గర్వకారణమని అన్నారు. తెలంగాణ సాధనకు టీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ భారీ బహిరంగ సభకు తాను హాజరయ్యానని చెప్పారు. తన రాజకీయ జీవితంలో అదొక ముఖ్యఘటన అని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక మధ్య సాంస్కృతిక సంబంధాల అభివృద్ధికి కేఆర్టీఏ చేస్తున్న కృషిని దేవెగౌడ ప్రశంసించారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ గుణాత్మక మార్పు తేవడం ఖాయమన్నారు. కుమార మక్తళ మాట్లాడుతూ పాత హైదరాబాద్ సంస్థానం పరిధిలోని కర్ణాటక జిల్లాల్లో తమ సంస్థ కార్యకలాపాలు చేపట్టనున్నట్టు చెప్పారు. కేఆర్టీఏ ప్రతినిధివర్గంలో ప్రధాన కార్యదర్శి ఈవీ సతీశ్ తదితరులు ఉన్నారు.