న్యూఢిల్లీ(నమస్తే తెలంగాణ): దేశ ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ పార్లమెంట్లో పోరాడనుందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశరావు అన్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ లైబ్రరీ హాలులో నిర్వహించిన అఖిల పక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని అనేక సమస్యలపై సమావేశాలలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున చర్చ లెవనెత్తుతుందని కేశవరావు పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం ప్రాతిపదికగా బీఆర్ఎస్ వెళుతుందన్నారు. అఖిలపక్ష సమావేశంలో తమ చేతికిచ్చిన జాబితాలో మొట్టమొదట ఢిల్లీ ఆర్డినెన్స్ ఉందన్నారు. ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కాదంటూ కేంద్రం అహంకారపూరితంగా ఆర్డినెన్స్పై బిల్లును తీసుకొస్తున్నదన్నారు.
గవర్నర్ల వ్యవస్థపై చర్చకు పట్టు: నామ
దేశంలో అనేక సమస్యలపై బీఆర్ఎస్ చర్చకు పట్టుబడుతుందని బీఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరావు అన్నారు. యూసీసీ, మణిపూర్ అల్లర్లపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. మహిళా బిల్లు కోసం పట్టుపడ్తామన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..గవర్నర్ల అంశంపై చర్చ చేపట్టాలని ఇదివరకే డిమాండ్ చేశామన్నారు. రైతు సమస్యలపై ఇచ్నిన హామీలపై పోరాడతామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టాలని కోరామన్నారు.