హైదరాబాద్, మార్చి16 (నమస్తే తెలంగాణ): అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అతి ముఖ్యమైన అంశంగా అదానీ వ్యవహారాన్ని పరిగణించాలని గురువారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. నోటీసులపై చర్చకు ఉభయ సభల అధిపతులు అనుమతినివ్వకపోవడంతో ఎంపీలు వెల్ లోకి వెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశ ప్రతిష్టను దిగజారుస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రం అనైతిక విధానాలను ఎండగట్టారు.
బీఆర్ఎస్, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఎండీఎంకే, ఆప్, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, జేడీయూ, జేఎంఎం, కాంగ్రెస్ సహ విపక్ష పార్టీల ఎంపీలందరూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష ఎంపీలు పార్లమెంట్ బయటకు వచ్చి మానవ హారంలా ఏర్పడి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు దీవకొండ దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, పోతుగంటి రాములు, రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, వెంకటేశ్ నేత, బీబీ పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వివిధ విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు.
ప్రజలే తగిన బుద్ధి చెప్తారు
హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారం నిగ్గు తేలేదాకా విడిచిపెట్టేది లేదని కేశవరావు, నామా నాగేశ్వర్రావు తేల్చి చెప్పారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ వ్యవహారాన్ని తేల్చాలని కోరుతున్నా పట్టించుకోని కేంద్రానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. కేంద్రానికి ప్రజలపై, దేశంపై ప్రేమ ఉంటే తక్షణమే అదానీపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. నాలుగు రోజులుగా పార్లమెంట్ స్తంభిస్తున్నా, వందలాది మంది ఎంపీలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రధాని మోదీ తనకేం పట్టనట్టు వ్యవహరించటం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రధాని దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చకు అనుమతించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.