హైదరాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల, పడిపోతున్న రూపాయి విలువ, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం తదితర అంశాలపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు, ఇతర విపక్ష ఎంపీలతో కలిసి రెండో రోజు మంగళవారం కూడా పార్లమెంట్ను స్తంభింపజేశారు. పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నా.. కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యహరిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. కేంద్రం అంతగా ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. కాగా, అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు.. లండన్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు మంగళవారం కూడా ఉభయ సభల్లో ఆందోళన చేశారు.
చర్చకు కేంద్రం భయపడుతున్నది..
కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిపై బీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ వ్యవహరంపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులను లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు అనుమతించలేదు. దీంతో బీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. లోక్సభలో నామా నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు విపక్షాలతో కలసి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. అదానీ-హిండెన్ బర్గ్ అంశంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం తదితర అంశాలపై తక్షణమే పార్లమెంట్ ఉభయ సభల్లో విస్తృత చర్చకు నామా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, ఇతర విపక్షాల ఆందోళనతో లోక్సభ సభను స్పీకర్ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే ఎంపీలు ఆందోళన ప్రారంభించడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చించాలని, అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని నామా నాగేశ్వరరావు దుయ్యబట్టారు. కేంద్రం కావాలనే పార్లమెంట్లో చర్చకు అనుమతించకుండా వెనకిపోతున్నదని విమర్శించారు.
గాంధీ విగ్రహం ముందు నిరసన
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. ‘వీ వాంట్ జేపీసీ-వీ డిమాండ్ జేపీసీ, దాదాగిరి నై చలెగీ-నై నై చలేగీ’ అంటూ నినాదాలు చేశారు. ‘లోక్తంత్ మే తానాషాహి నై చలేగి- నై చలేగి, లోక్తంత్ మే హిట్లర్ షాహి నై చలేగి- నై చలేగి’ అంటూ నినాదాలు చేశారు. పార్టీ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన చేశారు.
ఆస్కార్ అవార్డు గర్వకారణం: కే కేశవరావు
తెలంగాణ రాష్ర్టానికి చెందిన సినిమాకు ఆస్కార్ రావడం సంతోషంగా, గర్వంగా ఉన్నదని ఎంపీ కే కేశవరావు అన్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమాలను రాజ్యసభ అభినందించింది. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్టు ఒరిజనల్ సాంగ్ క్యాటగిరీలో అవార్డు దక్కిందని అన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమా తమ రాష్ర్టానికి చెందిన వారు తీసినా.. ఇది ప్రపంచ సినిమా అని అభినందించారు. ‘నాటు నాటు’ పాటకు అస్కార్ అవార్డు తీసుకొన్న కీరవాణి, చంద్రబోసు తమ రాష్ర్టానికి చెందిన వారు అయినా వారు దక్షిణ భారతదేశం, భారతదేశానికి చెందిన వారని శుభాకాంక్షలు తెలిపారు.