LK Advani | లక్నో : రామజన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వచ్చే ఏడాది జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన విషయం తెలిసిందే. కానీ వీహెచ్పీ మాత్రం ఆ ఇద్దరిని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని జనవరి 22న అయోధ్యకు తీసుకురావాలని బీజేపీ మాజీ ఎంపీ, రామ్ టెంపుల్ మూవ్మెంట్ సీర్ రామ్ విలాస్ వేదాంతి ఆదేశించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను రామ్ విలాస్ కోరారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వయసు దృష్ట్యా వారిని రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం లేదని డిసెంబర్ 18న రామ్ టెంపుల్ ట్రస్ట్ తెలిపిన సంగతి తెలిసిందే.
రామమందిరం ప్రారంభోత్సవానికి అద్వానీ తన కళ్లతో చూడాల్సిందేని, ఇది దేశం కోరిక మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రతి హిందువు కోరిక అని వేదాంతి చెప్పారు. ఎందుకంటే రామ్ టెంపుల్ మూవ్మెంట్లో అద్వానీ పాత్ర ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మనుగడకు, ఈ స్థాయికి చేరుకోవడానికి అటల్ బీహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఎంతో కృషి చేశారని వేదాంతి స్పష్టం చేశారు.
సోమ్నాథ్ నుండి అయోధ్య వరకు తన ‘రథయాత్ర’ ద్వారా అద్వానీ రామ మందిర ఉద్యమానికి భారీ సహకారం అందించారు. రామ్ లల్లాకు పవిత్ర ప్రతిష్ఠాపన జరుగుతున్నప్పుడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అద్వానీని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని తాను కోరుకుంటున్నానని వేదాంతి అన్నారు.