Brij Bhushan | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా అభియోగాలు నమోదు చేసేందుకు తగిన ఆధారాలను సేకరించినట్టు ఢిల్లీలోని హౌస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించారు. మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడిన పలు సందర్భాలను ఢిల్లీ పోలీసులు వివరించారు.
ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు తజకిస్థాన్ వెళ్లిన మహిళా రెజ్లర్లలో ఒకరిని బ్రిజ్భూషణ్ తన గదికి పిలిపించుకొని బలవంతంగా కౌగలించుకున్నాడని, ఆమె ప్రతిఘటించడంతో ఓ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా అలా చేశానని తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. అలాగే ఓ మహిళా రెజ్లర్ చొక్కాను పైకెత్తి అసభ్యంగా పొట్టపై చేతితో తాకాడని వెల్లడించారు. భారత్ వెలుపల జరిగిన ఈ రెండు ఘటనలు తాను చేస్తున్న చర్యల పట్ల బ్రిజ్భూషణ్ పూర్తి అవగాహనతోనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఢిల్లీ పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ ఘటనలు జరిగిన సమయంలో బాధితులు స్పందించారా లేదా అనేది ముఖ్యం కాదని, వారికి అన్యాయం జరిగిందని నొక్కిచెప్పారు. ఢిల్లీలోని డబ్ల్యూఎఫ్ఐ ఆఫీస్లో జరిగిన ఓ ఘటనను కూడా పోలీసులు ప్రస్తావించారు.
లైంగిక ఆరోపణల విషయంలో ప్రభు త్వం నియమించిన కమిటీ బ్రిజ్భూషణ్కు క్లీన్చిట్ ఇవ్వలేదన్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపారు. ఆరోపణలు రుజువు కావని లేదా అబద్ధమని కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో ఎక్కడా చెప్పలేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.