న్యూఢిల్లీ, మే 2: రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఈసారి టికెట్ దక్కలేదు. ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ స్థానంలో ఈసారి ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ను బీజేపీ బరిలోకి దింపింది. ప్రస్తుతం కరణ్ భూషణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా ఉన్నారు. 2009, 2014, 2019లో కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ ఎంపీగా గెలిచారు. అంతకుముందు ఆయన గోండా నియోజకవర్గం నుంచి రెండుసార్లు, బల్రాంపూర్ నుంచి ఒకసారి ఎంపీగా పని చేశారు.
2011 నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా పని చేసిన బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు గత ఏడాది ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో బ్రిజ్ భూషణ్పై రెండు కేసులు నమోదయ్యాయి. మైనర్పై లైంగిక వేధింపులతో ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ బ్రిజ్ భూషణ్కు టికెట్ ఇస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ అధిష్ఠానం భావించింది. అయితే, ఈ ప్రాంతంలో బ్రిజ్ భూషణ్కు పట్టుండటంతో, ఎన్నికల్లో నష్టం జరగకుండా ఉండేందుకు ఆయన స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్కు టికెట్ ఇచ్చింది. కైసర్గంజ్కు ఐదో దశలో మే 20న ఎన్నికలు జరగనున్నాయి.
తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్కు బీజేపీ టికెట్ కేటాయించడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ బీజేపీ దిగజారుడుతనాన్ని బహిర్గతం చేసిందని అనుకుంటుండగానే, బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్ను బహుమతిగా అందించడం ద్వారా ఇంకా లోతుల్లోకి పతనం అవుతామని బీజేపీ నిరూపించుకుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ పేర్కొన్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ.. బ్రిజ్ భూషణ్ టికెట్ను అతడి కుమారుడికి ఇవ్వడం ద్వారా మహిళలకు న్యాయం చేస్తున్నట్టు చెప్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఇది సిగ్గుచేటు అని విమర్శించారు. బ్రిజ్ లైంగిక వేధింపులను ఖండించడానికి బీజేపీ సిద్ధంగా లేదని అర్థమైందని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోస్ పేర్కొన్నారు.