శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి ఇప్పటికే కౌంట్ డౌన్ షురూ అయ్యింది. ఇవాళ ఉదయం ప్రారంభమైన కౌంట్డౌన్ ఆదివారం తెల్లవారుజామున 12:07 గంటలకు ముగియగానే రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది. దాంతో దేశంలో పండుగకు ఒక రోజు ముందే దీపావళి కాంతులు విరజిమ్మనున్నాయి.
ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ వన్ వెబ్కి చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. మొత్తం 8 వేల కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రాకెట్.. రేపు 5,796 కేజీల బరువుతో రోదసిలోకి పరుగుతీయనుంది. ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరిన అనంతరం యూకేలోని గ్రౌండ్ స్టేషన్ సిబ్బంది వాటిని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు.
రాకెట్ భూమి నుంచి లాంచ్ అయిన తర్వాత 16.21 నిమిషాల్లో 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే దాదాపు ఆరు టన్నుల బరువుతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ఇండియన్ రాకెట్గా గుర్తింపు పొందనుంది. తొలి కమర్షియల్ మిషన్గా, తొలి మల్టీ శాటిలైట్ మిషన్గా కూడా ఈ ప్రయోగం చరిత్రలో నిలిచిపోనుంది.