Bridge Collapses | బీజేపీ-జేడీయూ కూటమి పాలనలోని బీహార్ (Bihar) రాష్ట్రంలో వరుసగా వంతెనలు (Bridge Collapse) కూలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది (Creates Panic). ఇప్పటికే మూడు బ్రిడ్జిలు కుప్పకూలగా.. తాజాగా మరో వంతెన కూలిపోయింది. కిషన్గంజ్ (Kishanganj) జిల్లాలో కంకై నదికి చెందిన ఉపనదిపై నిర్మించిన 70 మీటర్ల పొడవైన వంతెన కూలిపోయింది. ఈ వంతెన బహదూర్గంజ్ – దిఘల్బ్యాంక్ బ్లాక్లను కలుపుతుంది. ప్రస్తుతం ఈ వంతెన కూలిపోవడంతో రెండు పట్టణాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కంకై నదిలో నీటిమట్టం పెరిగినట్లు పేర్కొన్నారు. నీటి ప్రవాహం ఉద్ధృతి కారణంగా వంతెన మధ్యలో ఉన్న పలు స్తంభాలు సుమారు ఒకటిన్నర అడుగుల మేర మునిగిపోయాయని వివరించారు. కాగా, వారం వ్యవధిలోనే బీహార్ రాష్ట్రంలో వంతెనలు కూలిపోవడం వరుసగా ఇది నాలుగో ఘటన.
अररिया, सीवान और मोतिहारी के बाद किशनगंज में कनकई नदी पर बने पुल का पाया धंसा, किसी भी वक्त हो सकता है धराशायी; 6 साल पहले हुए था निर्माण,पुल पर आवाजाही बंद@RJDforIndia @yadavtejashwi @TejashwiOffice #Bihar #Kishanganj #Bridgecollapse pic.twitter.com/lMGtgLaebm
— बीपीएससी शिक्षक बहाली,बिहार ❁ (@ShikshakBahali) June 27, 2024
అరారియా జిల్లాలోని పరారియా గ్రామంలో గత మంగళవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. రూ.12 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వంతెనలో అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఇంకా చేపట్టలేదు. దీంతో ఈ వంతెనపై ప్రజా రవాణాకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. బక్రా నదిపై కుర్సా కంటా, స్కిటీ ప్రాంతాలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జి కూలడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆ తర్వాత శనివారం ఉదయం సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్ బ్లాక్స్లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్పై కట్టిన ఈ బ్రిడ్జ్..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు.
ఆ తర్వాతి రోజు అంటే ఆదివారం తూర్పు చంపారన్లో నిర్మాణంలో ఉన్న 16 మీటర్ల వంతెన కుప్పకూలింది. మోతిహారి బ్లాక్లో ఘోరసహాన్లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ముప్పు వాటిల్లలేదని జిల్లా అధికారులు వెల్లడించారు. ఆమ్వా అనే గ్రామాన్ని ఇతర ప్రాంతాలకు కలుపుతూ కెనాల్పై ఈ బ్రిడ్జ్ను రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మిస్తున్నది. మోతీహరిలో (Motihari) రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఇది ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటుచేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండటంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వరుస ప్రమాదాలతో అధికారులు కూడా ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా..? లేక ఎవరైనా కావాలనే కూల్చి వేస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
Surprise Meet | దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే స్పెషల్ మీట్.. వీడియో వైరల్
Minister Atishi | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఢిల్లీ మంత్రి అతిషి
NEET-UG Paper Leak | నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో ఇద్దరి అరెస్ట్