లక్నో : ఓ వధువు వరుడికి షాక్ ఇచ్చింది. వరుడి చిటికెన వేలు పట్టుకుని ఏడు అడుగులు వేస్తుండగా, నాలుగు అడుగులు వేయగానే తాను వాష్రూమ్కు వెళ్లొస్తానంటూ వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని మోదీనగర్లో వెలుగు చూసింది.
మోదీనగర్లో నివసిస్తున్న ఓ యువకుడికి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. యువతి ఫోటోను వాట్సాప్లో చూసి తనకు నచ్చిందని చెప్పాడు. యువతిని పెళ్లి చేసుకోవాలంటే ఎదురుకట్నం రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కట్నం ఇచ్చేందుకు యువకుడి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు.. పార్తపూర్లో భదబ్రాల్ గ్రామంలోని ఆలయంలో యువతి, యువకుడికి వివాహ ఏర్పాట్లు చేశారు. వారి వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు నడుస్తోంది.
పెళ్లి వేదికపై ఉన్న అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, వాష్రూమ్ వస్తుందంటూ పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్లింది. నగలు, డబ్బుతో నూతన వధువు అక్కడ్నుంచి ఉడాయించింది. యువతి పారిపోయిందనే విషయం తెలియగానే వివాహ వేదిక వద్ద ఉన్న పురోహితుడు, యువతి తల్లిదండ్రులు సైతం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వధువుతో పాటు ఆమె తల్లిదండ్రులు, పురోహితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.