మైసూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
మైసూరులో కొత్తగా పెళ్లయిన ఓ జంట ఫంక్షన్ హాల్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేసింది. వివాహ వేడుకకు హాజరైన బంధుమిత్రులు ఫంక్షన్ హాల్లో ఉండగానే నూతన వధూవరులు తమ ఓటు హక్కు వినియోగించుకుని వచ్చారు. ఆ కొత్త జంటపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇంట్లో ఖాళీగా కూర్చుని కూడా ఓటు వేయడానికి బద్దకించే వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో.. పెళ్లి వేడుకల మధ్యలో వీలు చేసుకుని ఓటు వేయడం ప్రజాస్వామ్యంపట్ల వారికి ఉన్న గౌరవాన్ని సూచిస్తున్నదని స్థానికులు మెచ్చుకుంటున్నారు.