‘రీసైకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ దేశాయ్ ఘనత
న్యూఢిల్లీ, జూలై 26: కరోనా మహమ్మారి పర్యావరణానికీ ముప్పుగా మారింది. వాడి పారవేసే సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్లతో బయోమెడికల్ వ్యర్థాలు భారీగా పెరిగిపోయాయి. అవి కుప్పలుతెప్పలుగా సముద్రతీరాల్లో తేలుతున్నాయి. డంపింగ్ యార్డుల్లో కనిపిస్తున్నాయి. మన నిర్వహణ సామర్థ్యాన్ని మించిపోయిన ఈ వ్యర్థాలను ఏం చేయాలి? పరిస్థితులు చేయిదాటిపోకుండా చేయడమెలా? దీనికి 27 ఏండ్ల పర్యావరణవేత్త డాక్టర్ బినీశ్ దేశాయ్ పరిష్కార మార్గం చూపించారు. ‘రీసైకిల్ మ్యాన్’గా పేరొందిన దేశాయ్… బయోమెడికల్ వ్యర్థాల నుంచి పర్యావరణ హితమైన ఇటుకలను తయారుచేస్తున్నారు. గుజరాత్లోని సూరత్ జిల్లాకు చెందిన ఆయన 2010లో 16 ఏండ్ల వయసులోనే ‘ఎకో-ఎలక్ట్రిక్ టెక్ గ్రూప్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. కాగితంలో చుట్టిన ‘చూయింగ్ గమ్’లతో ఇటుకలు తయారుచేయడం మొదలుపెట్టారు. దేశాయ్ చిన్నప్పుడు చూయింగ్ గమ్ నమిలి, తర్వాత దాన్ని కాగితంలో చుట్టి జేబులో పెట్టుకున్నారట. రెండ్రోజుల తర్వాత చూస్తే అది రాయిలా గట్టిపడిపోవడాన్ని గమనించారు. ఈ అనుభవమే కొత్త తరహా ఇటుక 1.0ను తయారుచేయడానికి తనకు ప్రేరణ అని దేశాయ్ చెబుతారు. ఇప్పుడు బ్రిక్ 1.0కి కొత్త వెర్షన్గా బ్రిక్ 2.0ను టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇందులో వాడి పారేసిన పీపీఈ కిట్లు, మాస్కులను వాడుతున్నారు. ‘మొత్తం వ్యర్థాల్లో ఇవి 52 శాతం ఉంటాయి. మిగతావి చిత్తుకాగితాలు’ అని దేశాయ్ తెలిపారు. మట్టి ఇటుకల కంటే బ్రిక్ 2.0 మూడు రెట్లు బలంగా ఉంటుందని చెప్పారు. ‘ఇది సిమెంట్తో చక్కగా అతుక్కుంటుంది. రీసైకిల్ చేయవచ్చు. సాధారణ ఇటుకలతో పోలిస్తే సగమే ఖర్చు అవుతుంద’ని దేశాయ్ వివరించారు. తయారీ విధానం పర్యావరణహితంగా ఉంటుందన్నారు. వీటి గురించి ఆరా తీస్తూ ఆస్ట్రేలియా, అమెరికా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్ తదితర దేశాల నుంచి కూడా దేశాయ్కి ఫోన్లు వస్తున్నాయి. ప్రతి వ్యర్థానికి పరిష్కారం కనుగొని 2025 నాటికి దేశాన్ని జీరో-వేస్ట్గా రూపొందించాలన్నదే తన లక్ష్యమని దేశాయ్ తెలిపారు.