డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సోమవారం పురోగతి కనిపించింది. (Uttarkashi tunnel rescue operation) తొమ్మిది రోజులుగా చిక్కుకున్న 41 మంది కార్మికులు ఉన్న చోటకు 6 అంగుళాల వెడల్పు ఉన్న ప్రత్యామ్నాయ పైపు చేరుకున్నట్లు ఎన్హెచ్ఐడీసీఎల్ డైరెక్టర్ అన్షు మాన్షిష్ తెలిపారు. లోపల ఉన్న కార్మికుల ఆహార అవసరాలు తీర్చడానికి ప్రత్యేక ఆహారం కోసం వైద్య నిపుణులను సంప్రదించినట్లు చెప్పారు. సోమవారం మూంగ్ కిచిడీని ఈ పైప్ ద్వారా పంపుతామని అన్నారు. తొలుత మూత ఉన్న సీసాల్లో పండ్లతో పాటు తేలికపాటి భోజనాన్ని సొరంగంలో చిక్కుకున్న కార్మికులను అందిస్తామని వెల్లడించారు. అలాగే కార్మికులతో సంప్రదింపులు జరిపేందుకు చార్జర్తో కూడిన ఫోన్ కూడా పంపనున్నట్లు వివరించారు.
కాగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కూడా రెస్క్యూ ఆపరేషన్లో భాగమైంది. 20, 50 కిలోల బరువున్న రెండు రోబోలను కూలిన సొరంగంలోకి పంపింది. లోపల చిక్కుకున్న కార్మికుల పరిస్థితిని ఈ రోబోలు అంచనా వేస్తాయి. రెస్క్యూ ఆపరేషన్కు సహకరిస్తాయి.
మరోవైపు కూలిన టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం పెద్ద యంత్రాలను అక్కడకు తరలిస్తున్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం కూడా సోమవారం సంఘటనా స్థలానికి చేరింది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.