(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాత్రం ఆ ధరల మంటకు బ్రేక్ వేస్తుంది. కారణం.. ధరల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడకూడదనే. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) విక్రయానికి కూడా అమలు చేస్తున్నది. పీఎస్యూల అమ్మకం, వాటిలో వాటాల ఉపసంహరణ ద్వారా 2014-2022 మధ్య బీజేపీ సర్కారు రూ.4.48 లక్షల కోట్లను అర్జించింది.
అయితే వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విక్రయ ప్రక్రియను నిలిపివేయాలని కేంద్రం తాజాగా నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎస్యూల ప్రైవేటీకరణ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించవచ్చన్న అభిప్రాయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఐడీబీఐ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బీఈఎంఎల్, ఎన్ఎండీసీ స్టీల్ వంటి ఇప్పటికే విక్రయం పూర్తి కావొచ్చిన డీల్స్ను వెంటనే ముగించాలని సర్కారు యోచిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.