Viral News | ప్రయాణ సమయంలో ఏదైనా పడేసుకుంటే కొందరు దాన్ని శుభ్రం చేస్తారు. మరికొందరు మనకెందుకు స్వీపర్లు చేస్తారులే అనుకుంటారు. ఇంకొందరైతే స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఇతరులు పడేసిన చెత్తను సైతం తీసుకుని దగ్గర్లోని డస్ట్బిన్లో వేస్తుంటారు. అయితే, తాజాగా ఢిల్లీ మెట్రో రైల్లో ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ యువకుడు తన టిఫిన్ బాక్స్ కిందపడిపోతే దాన్ని నీట్గా శుభ్రం చేసి అందరి నుంచి ప్రశంసలు పొందుతున్నాడు.
ఓ యువకుడు ఇటీవల ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో దాహం వేయడంతో తన బ్యాగ్లోని వాటర్ బాటిల్ను తీసుకోబోయాడు. ఆ సమయంలో పొరపాటున యువకుడి బాక్స్ కిందపడిపోయి.. అందులోని ఆహారం అంతా నేలపాలైంది. దీంతో ఆ యువకుడు వెంటనే తన వద్ద ఉన్న పుస్తకంలోని పేపర్లను చింపి రైల్లోని ఫ్లోర్ను తుడుస్తాడు. అనంతరం ఆహారం పడకముందు రైలు ఫ్లోర్ ఎంత నీట్గా ఉందో అంతే నీట్గా తన హ్యాండ్ కర్చిప్తో శుభ్రం చేస్తాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అషు సింగ్ అనే నెటిజన్ లింక్డిన్లో పోస్టు చేశాడు. ‘ఈ యువకుడు స్వచ్ఛభారత్ మిషన్కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు యువకుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘అవును ఈ యువకుడు నిజంగానే స్వచ్ఛభారత్కు బ్రాండ్ అంబాసిడర్..’, ‘దీన్నే బాధ్యత అంటారు..’ ‘సూపర్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.