న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపై డ్యాన్స్ చేశాడు. బాధితుడైన 17 ఏండ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రోజువారీ కూలీ అతడు.. మంగళవారం రాత్రి జనతా మజ్దూర్ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ 16 ఏండ్ల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినడానికి రూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు.
అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆవేశానికి లోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కిందపడిపోయిన బాధితుడిపై కూర్చున్న నిందితుడు.. మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడు చనిపోయాడు. అప్పటికీ శాంతించని ఆ కుర్రాడు అతని దేహంపై డ్యాన్స్ చేశాడు. గమనించిన స్థానికులు ఆ యువకుడిని దవాఖానాకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఇదంతా ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన కుర్రాడు కూడా జఫ్రాబాద్లోని మురికివాడలో నివసిస్తున్నడాని, అతడు మధ్యలో పాఠశావిద్యను ఆపేశాడని చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు తెలియరని వెల్లడించారు. గతంలోనూ అతనిపై ఓ హత్య కేసు ఉన్నదని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.