Man burns: చలిని భరించలేక ఓ వ్యక్తి తన గదిలో నిప్పుల కుంపటి పెట్టుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత ఆ నిప్పుల కుంపటే అతడి ప్రాణాలు తీసింది. ఒంటికి మంటలంటుకుని సజీవదహనమయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలోని న్యూ మంగ్లాపూర్ ఏరియాలోగల అంగన్వారీ వాలీ గల్లీలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఓ సంస్థలో బౌన్సర్గా పనిచేసే వినయ్ అరోరా బుధవారం విధి నిర్వహణ అనంతరం తన గదికి చేరుకున్నాడు. విపరీతమైన చలి కారణంగా నిద్రపట్టకపోవడంతో కొన్ని బొగ్గులు ఓ గిన్నెలో వేసి వాటికి నిప్పంటించి కుంపటి పెట్టుకున్నాడు. దాంతో గది వెచ్చబడటంతో హాయిగా నిద్రలోకి జారుకున్నాడు.
నిద్రలో బొర్లుతూ కుంపటి దగ్గరికి చేరిన వినయ్ దుస్తులకు మంటలు అంటుకున్నాయి. అతను నిద్రలోంచి తేరుకునే లోపే మంటలు చుట్టుముట్టి సజీవదహనమయ్యాడు. ఆ గదిలోని దుస్తులు, ఫర్నీచర్ కూడా కాలి బూడిదయ్యాయి. మంటలు గమనించి స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా ప్రాంతంలో లభ్యమైన ఆధారాలను బట్టి చలి కోసం పెట్టుకున్న నిప్పుల కుంపటే అగ్నిప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. తదుపరి దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు.