బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించారు. మొదటి రోజు గుజరాత్ పర్యటనలో తనకు లభించిన స్వాగతానికి బోరిస్ జాన్సన్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీకి తనకు అత్యంత దగ్గరి స్నేహితుడని బోరిస్ జాన్సన్ ఈ సందర్భంగా ప్రకటించారు.
”ఇంత ఘనంగా నాకు స్వాగతం పలికినందుకు ప్రధాని మోదీకి, భారత ప్రజలకు నా ధన్యవాదాలు. నా స్వాగత హోర్డింగులు చూసి.. ఓ సచిన్ టెండూల్కర్లా, అమితాబ్లా ఫీలయ్యాను. ప్రతి చోటా హోర్డింగులు పెట్టారు. ఇంతటి స్వాగతం బహుశః నేనెక్కడా చూడనేమో” అంటూ బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న వేళ… బోరిస్ జాన్సన్ పర్యటించడం ఓ చారిత్రక సందర్భమని పేర్కొన్నారు.