ఐజ్వాల్: అసోం, మిజోరం సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణలకు ( Border Clashes ) సంబంధించి అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మకు వ్యతిరేకంగా తమ రాష్ట్రంలో నమోదైన కేసును పునఃపరిశీలిస్తామని మిజోరం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మిజోరం రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ లాల్నున్మావియా చువాంగో ఒక ప్రకటన చేశారు. అసోం సీఎం హిమాంత బిశ్వశర్మకు వ్యతిరేకంగా మిజోరంలో ఎఫ్ఐఆర్ నమోదైన విషయం మిజోరం ముఖ్యమంత్రి జొరామ్తంగకు గానీ, తనకుగానీ తెలియదని లాల్నున్మావియా చెప్పారు. ఈ కేసు విషయాన్ని సీఎం జొరామ్తంగ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పునఃపరిశీలిద్దామని చెప్పినట్లు తెలిపారు.
జూలై 26న అసోం, మిజోరం సరిహద్దుల్లో ఆ రెండు రాష్ట్రాల పోలీసుల బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతిచెందారు. ఎస్పీ సహా మరో 50 మంది గాయపడ్డారు. మిజోరం వైపు కూడా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘర్షణలకు సంబంధించి జూలై 30న మిజోరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ, మరో నలుగురు సీనియర్ అధికారులను అందులో నిందితులుగా చేర్చారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింది వారిపై కేసులు నమోదు చేశారు.