న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: యువత కొవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవటం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు. వృద్ధుల తర్వాత వైరస్ బారిన పడుతున్నది వారేనని చెప్తున్నారు. ఇప్పటి వరకు 70 ఏండ్ల పైబడినవారిలో 90 శాతం మంది బూస్టర్ డోస్ వేసుకోగా, 39 శాతం యువత మాత్రమే బూస్టర్ తీసుకొన్నదని తెలిపారు. బూస్టర్ డోస్ తీసుకొన్నవారిలో తీవ్ర అనారోగ్యం, దవాఖానలో చేరటం, ప్రాణ ముప్పు తగ్గాయని వివరించారు. వీటిని దృష్టిలో పెట్టుకొని యువత కూడా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచిస్తున్నారు. యువత బూస్టర్ డోస్ ఎందుకు తీసుకోవాలనుకొనేదానికి 5 సహేతుకమైన కారణాలను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వివరించారు.
1. ఎంఏఆర్ (తట్టు, గవద బిళ్లలు, రుబెల్లా) టీకాలా కొవిడ్ వ్యాక్సిన్ జీవితకాల రక్షణను అందించదు. టీకా తీసుకొన్నవారి రోగనిరోధకశక్తి కాలక్రమేణా క్షీణిస్తుంది. టీకా తీసుకొన్న 6 నెలల తర్వాత ఇమ్యూనిటీ క్షీణించి, మళ్లీ వ్యాధి బారినపడే ముప్పు ఉన్నది. అందుకే తప్పనిసరి బూస్టర్ వేసుకోవాలి. ఎంఆర్ఎన్ఏ టీకా బూస్టర్తో కొవిడ్ నుంచి జీవితకాల రక్షణ పొందవచ్చు.
2. వ్యాక్సిన్ తీసుకొన్న వ్యక్తికే కాకుండా, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తుంది. యువత ఎక్కువగా బయట తిరుగుతుంటారు. వీరితో ఇతరులకు కొవిడ్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కనుక యువత తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలి. బూస్టర్ వేసుకొన్న తల్లిదండ్రులున్న ఇంట్లో పిల్లలకు కొవిడ్ ముప్పు తగ్గినట్టు అధ్యయనంలో తేలింది.
3. కొవిడ్ వ్యాక్సిన్లు దీర్ఘకాలిక కొవిడ్ ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ తీసుకొన్నవారిలో ఈ ముప్పు 15 శాతం తగ్గుతుందని ఓ అధ్యయనంలో, దీర్ఘకాలిక కొవిడ్ రిస్క్ పూర్తిగా తగ్గిపోయిందని మరో అధ్యయనంలో వెల్లడైంది.
4. కొవిడ్ సోకిన యువత ఉద్యోగాలు, చదువుకు దూరం కావాల్సి వస్తున్నది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. బూస్టర్ డోస్ తీసుకొంటే కొవిడ్ బారినపడే అవకాశం తగ్గుతుంది.
5. కొవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమైనవి. ప్రపంచవ్యాప్తంగా రెండేండ్లుగా బిలియన్లకొద్దీ కొవిడ్ వ్యాక్సిన్ డోస్లను ఇచ్చారు. ఇవి ప్రభావవంతంగా పనిచేయడంతోపాటు సురక్షితమైనవని తేలింది. తక్కువ సందర్భాల్లో దుష్ప్రభావాలు బయటపడ్డాయి. వ్యాక్సిన్లు ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయని, ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అపోహేనని పరిశోధకులు తెలిపారు. కొవిడ్ పూర్తిగా తగ్గాలంటే బూస్టర్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు.