బెంగళూరు(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో డబుల్ ఇంజిన్ సర్కారు పనితీరు ఎలా ఉందంటే.. ఆ రాష్ర్టానికి చెందిన ఓ స్వామీజీ స్వయంగా ముఖ్యమంత్రి బొమ్మై సమక్షంలోనే బీజేపీ సర్కారును కడిగిపారేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని సీఎం బలవంతంగా స్వామీజీ మైక్ను లాక్కున్నారు. గురువారం మహదేవపుర శాసనసభ నియోజక వర్గంలోని గరుడాచార పాళ్య మంజునాథస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. సీఎం బసవరాజ బొమ్మై సమక్షంలోనే కనకగురు పీఠాధిపతి ఈశ్వరానంద పురి స్వామి విమర్శలు కురిపించారు.
స్థానిక సమస్యల్ని ఏకరువు పెట్టారు. ‘వర్షాలకు నగరం జలమయమైనపుడు కార్పొరేషన్ అధికారులు ఆ ప్రాంతాల్ని సందర్శిస్తారు. సమస్య మాత్రం పరిష్కారం కాదు. బెంగళూరువాసుల సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారిస్తామని సీఎం బొమ్మై భరోసా ఇచ్చారు.
ఇలా ఎన్నో భరోసాల్ని విన్నాం. మాకు కావాల్సింది కార్యాచరణ. వట్టి మాటలు కాదు’ అని స్పష్టం చేశారు. స్వామీజీ మాటలతో ఇరకాటంలో పడ్డ సీఎం బొమ్మై బలవంతంగా ఆయన నుంచి మైక్ లాక్కొని నియోజక వర్గ సమస్యల పరిష్కారం కోసం పనులు జరుగుతున్నాయని బిగ్గర స్వరంతో బదులిచ్చారు. అనేక సమాచార, సాంకేతిక సంస్థలకు నిలయమైన మహదేవపురలో రోడ్డు, మురుగు నీటి కాల్వలు అత్యంత దారుణంగా ఉన్నాయి. చిన్నపాటి వానలకు కూడా జలమయమవుతుంటుంది.