న్యూఢిల్లీ, మే 30: రాజకీయ పదవుల్లో మాజీ జడ్జీల నియామకంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన రెండేండ్ల తర్వాతనే గవర్నర్ లేదా ఇతర రాజకీయ పదవులు చేపట్టేలా తగిన కాల వ్యవధి ఉండాల్సిన అవసరం ఉన్నదని బాంబే లాయర్స్ అసోసియేషన్ పేర్కొన్నది. రిటైర్మెంట్కు రెండు సంవత్సరాల తర్వాతే(కూలింగ్ ఆఫ్ పీరియడ్) జడ్జీలు ఏవైనా రాజకీయ పదవులు స్వీకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
రిటైర్మెంట్ తర్వాత తగిన కాల వ్యవధి లేకుండా మాజీ న్యాయమూర్తులు రాజకీయ పదవులను స్వీకరించడం వలన.. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రజలకు అనుమానాలు వచ్చే ప్రమాదం ఉన్నదని సోమవారం దాఖలు చేసిన పిటిషన్లో అభిప్రాయపడింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 12న ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియామకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. సీజేఐగా పదవీ విరమణ తర్వాత ఐదు నెలలకు కేరళ గవర్నర్ అయిన జస్టిస్ సదాశివం, నాలుగు నెలలకు రాజ్యసభ ఎంపీగా కేంద్రం నామినేట్ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్లను కూడా అసోసియేషన్ పిటిషన్లో ప్రస్తావించింది.