Bombay high court: భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, ప్రస్తుతం అలాంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. రానురాను విద్య తన పవిత్రతను కోల్పోతోందని పేర్కొంది. అందరికీ నాణ్యమైన విద్య అందేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపింది.
పుణెలో విద్యాసంస్థల ఏర్పాటు కోసం రెండు సంస్థలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ చందూర్కర్, జస్టిస్ జితేంద్ర జైన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యావిధాన విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని, ఉత్తమమైన విద్యాసంస్థలను ఎంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి అధికారం ఉంటుందని వ్యాఖ్యానించింది.