ముంబై : వన్యప్రాణుల (సంరక్షణ) చట్టం ప్రకారం చిలుకలు వన్యప్రాణులేనని, వీటితో పౌరులకు కలిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేయాలని బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలురించింది. అడవి చిలుకల వల్ల దెబ్బతిన్న దానిమ్మ చెట్లకు సంబంధించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 200 చెట్లకు జరిగిన నష్టానికిగాను, ఒక్కో చెట్టుకు రూ.200 చొప్పున చెల్లించాలని కోర్టు పేర్కొన్నది.
2016 మే నెలలో సమీపంలోని వన్యప్రాణుల అభయారణ్యం నుంచి వచ్చిన అడవి చిలుకల వల్ల తన దానిమ్మ చెట్లు దెబ్బతిన్నాయని వార్దా జిల్లాలోని హింగి గ్రామానికి చెందిన రైతు మహదేవ్ డికాటే (70) దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు పై తీర్పు వెలువరించింది. నష్టపరిహారం చెల్లించకపోతే, రైతులు వన్యప్రాణులకు హాని కలిగించే చర్యలకు పాల్పడవచ్చునని జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే, జస్టిస్ నివేదిత మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నెల 24న పేర్కొన్నది.