ముంబై: టైరు పేలడం మానవ నిర్లక్ష్యమేనని, దేవుడి చర్య కాదని బాంబే హైకోర్టు పేర్కొన్నది. కారు టైరు పేలిన ప్రమాదంలో బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని బీమా సంస్థను ఆదేశించింది. 2010 అక్టోబరు 25న ముగ్గురు వ్యక్తులు పుణే నుంచి ముంబై వెళ్తుండగా టైరు పేలి కారు లోయలో పడిపోయింది. మకరంద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మకరంద్ కుటుంబానికి రూ.1.25 కోట్లు పరిహారం చెల్లించాలని న్యూ ఇండియా అస్సూరెన్స్ కంపెనీని 2016లో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. దీనిపై బీమా కంపెనీ బాంబే హైకోర్టులో అప్పీల్ చేసింది. అధిక వేగం, గాలి తక్కువ లేదా ఎక్కువ ఉండటం, ఉష్ణోగ్రత, సెకండ్ హ్యాండ్ టైర్లు వంటివి టైరు పేలడానికి కారణాలు కావచ్చని కోర్టు పేర్కొన్నది.