Bombay High Court | పరిహారం బహుమానం కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ భర్త కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. పంప్ హెల్పర్గా పని చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. భర్త మృతికి ప్రభుత్వం పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని మహిళ పిటిషన్లో కోర్టును కోరింది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన కంచన్ తన భర్త మరణానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
నిత్యవసర సేవల కింద పని చేసేవాడని, 2021 ఏప్రిల్లో ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. తన భర్తను రాష్ట్ర ప్రభుత్వమే విధుల్లో మోహరించిందని.. కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయాని తెలిపింది. తనకు పరిహారం చెల్లించాలన్న డిమాండ్ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాన్ని ఆదేశించాలని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ను కోరారు. అయితే, ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ మహిళ అభ్యర్థతను తిరస్కరించడంలో ప్రభుత్వం తప్పులేదని జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ ఆర్ఎం జోషి ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసులను సున్నితంగా పరిష్కరించాలనే చర్చలేదని.. మరో వైపు రూ.50లక్షల పరిహారం పొందేందుకు అర్హులు కాని వారికి మొత్తం ఇవ్వరాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టు.. వారికి బహుమతిగా ఇవ్వలేమన్నారు.
ఇలాంటి కేసులను నిర్లక్ష్యంగా పరిష్కరిస్తే.. అనర్హులకు కూడా పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి రూ.50లక్షల పరిహారం అందుతుందని అభిప్రాయపడింది. వాస్తవానికి మహారాష్ట్ర ప్రభుత్వం అత్యవసర విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులకు రూ.50లక్షల ప్రమాద బీమాను అందించాలని నిర్ణయించింది. సర్వే, ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ వంటి క్రియాశీల విధుల్లో నిమగ్నమైన వారికి మాత్రమే ఈ ప్రమాద బీమా వర్తింపజేసింది.