ముంబై : వాట్సాప్ గ్రూప్ లో సభ్యుల పోస్టులకు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లను బాధ్యుల్ని చేయలేమని బాంబే హైకోర్ట్ నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. వారి మధ్య ఉమ్మడి ఉద్దేశం, ముందస్తు ప్రణాళికతోనే ఇలా చేశారని నిరూపణ అయితేనే గ్రూప్ అడ్మిన్లను బాధ్యుల్ని చేయాలని పేర్కొంది. సభ్యుడు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్ కు గ్రూప్ అడ్మిన్ ను బాధ్యుడిని చేయలేమని జస్టిస్ జకా హక్, జస్టిస్ అమిర్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.
గ్రూప్ సభ్యుడు ఎవరైనా అభ్యంతరకరమైన పోస్ట్ లు చేస్తే అతడు లేదా ఆమెపై చట్ట నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొంది. గ్రూప్ ల్లో షేర్ అయ్యే కంటెంట్ ను సెన్సార్ చేయడం, కుదించడం, నియంత్రించడం వంటి అధికారాలు వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ కు లేదని కోర్ట్ పేర్కొంది. అడ్మినిస్ట్రేటర్లు గ్రూపులను ఏర్పాటు చేసి సభ్యులను జోడించడం, తొలగించడం మాత్రమే చేస్తారని గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత అడ్మిన్లు, సభ్యుల విధులు ఒకేరకంగా ఉంటాయని పేర్కొంది.