Ahmedabad : గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఒక బాంబు బెదిరింపు నోట్ కనిపించడంతో అహ్మదాబాద్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన లక్నో నుంచి డమ్మామ్ వెళ్తున్న ఇండిగో విమానంలో, గురువారం సాయంత్రం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 6ఈ 97 పేరుగల ఇండిగో విమానం గురువారం సాయంత్రం 4.17 గంటలకు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి సౌదీ అరేబియాలోని డమ్మామ్ పట్టణానికి బయల్దేరింది.
అయితే, విమానం గాలిలో ప్రయాణిస్తుండగా.. విమానంలో ఒక టిష్యూ పేపర్పై బాంబ్ అని రాసి ఉంది. దీంతో కంగారు పడిన విమాన సిబ్బంది.. ఏటీసీకి సమాచారం అందించారు. వారు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతించారు. దీంతో విమానాన్ని సాయంత్రం 5.43 గంటలకు గుజరాత్లోని అహ్మదాబాద్లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 107 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికుల్ని, సిబ్బందిని భద్రతా సిబ్బంది బయటకు దింపేశారు. విమానాన్ని దూరంగా టెర్మినల్ 2కు తరలించారు.
సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం విమానంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎస్వోజీ, సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసుల కూడా విమానంలో తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి బాంబు, పేలుడు పదార్థాలు లేవని అధికారులు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. గత నెల 31న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దమ్మామ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానంలోని టిష్యూ పేపర్పై కూడా బాంబ్ అని రాసి ఉండటంతో అహ్మదాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం ఏ బాంబు లేదని తేల్చారు.