BRICS : రష్యా-ఇండియా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ఇండియా విమానాలు కొంటూ వస్తోంది. తాజాగా మరిన్ని విమానాల్ని రష్యా నుంచి కొనేందుకు ఇండియా సిద్ధమైంది. 105 వరకు ప్రాంతీయ, పౌర రవాణా విమానాల్ని రష్యా నుంచి ఇండియా కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి.
శనివారం నుంచి ప్రారంభ కానున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇండియా-రష్యా మధ్య ఈ అంశంపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్-114-300 సంస్థకు చెందిన ప్రాంతీయ, ప్యాసింజర్ విమానాల్నిఇండియాలోని వివిధ సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. ఈ అంశంపై సంస్థ సీఈవో వాదిమ్ బదేకా మాట్లాడుతూ గత ఆరు నెలలుగా ఇండియన్ కంపెనీలతో చర్చలు జరిగాయని, అనేక ఒప్పందాలు జరిగాయని వెల్లడించారు. ఇండియన్ కంపెనీలైన పినాకిల్ ఎయిర్ సంస్థ 50 విమానాల్ని, ఎయిర్ కేరళ సంస్థ 20 విమానాల్ని కొనుగోలు చేయనుండగా.. మరో సంస్థ మిగతా 35 విమానాల్ని కొనుగోలు చేయనుంది.
ఈ మేరకు సంస్థల మధ్య ఎంవోయూ కుదుర్చుకోనున్నాయి. అలాగే, ఆరు విమానాలకు సంబంధించి ఫ్లెమింగో ఏరోస్పేస్ సంస్థ జనవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు.. ఇండియాలో విమానాల తయారీ అంశాన్ని కూడా రష్యా పరిశీలిస్తున్నట్లు సమాచారం. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థతో యూఏసీ ఈ అంశంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది అమలైతే.. రెండు సంస్థలు కలిసి ఇండియాలోనే సంయుక్తంగా విమానాల్ని తయారు చేస్తాయి.