చంఢీగఢ్, జనవరి 2: పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రుల ఇండ్ల సమీపంలో సోమవారం మామిడితోటలో కన్పించిన ఒక బాంబు కలకలం రేపింది. నయాగావ్-కన్సాల్ రోడ్డులోని మామిడి తోటలో ఈ బాంబును పోలీసులు గుర్తించారు. ఆ ప్రదేశానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ల ఇళ్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే కిలోమీటర్ దూరాన ముఖ్యమంత్రుల హెలిప్యాడ్ కూడా ఉంది. బాంబు గురించి తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి బాంబు స్క్వాడ్ను రప్పించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ డీజీపీ ఏకే పాండే మాట్లాడుతూ ఆ బాంబ్ మిస్ఫైర్డ్ బాంబ్ కావొచ్చని అభిప్రాయపడ్డారు. బాంబు దొరికిన ప్రదేశానికి చుట్టుపక్కల స్క్రాప్ డీలర్లు కొందరు ఉన్నారని మిలటరీ ఫైరింగ్ రేంజి నుంచి సరిగా పేలని బాంబులు సైతం వారు తెస్తుంటారని తెలిపారు. అలా ఎవరైనా తెచ్చి దీనిని ఇక్కడ పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.