మియాపూర్, జూన్ 30 : మనం ఆవాసాలను మరింతగా బాగుచేసుకునేందుకు, పరిశుభ్రంగా మలుచుకునేందుకు పట్టణ ప్రగతికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి నిజమైన ప్రగతిని సాధించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, బస్తీ ఆదర్శంగా రూపుదిద్దుకోవాలన్నారు. నేటి నుంచి పది రోజుల పాటు జరగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించాలని చిత్తశుద్ధితో ఇందులో భాగస్వాములై స్వచ్ఛ పరిసరాలు, పరిశుభ్రమైన వీధులు, వ్యర్థాలు లేని నాలాలు, రహదారులపై నీరు నిల్వ ఉండని గుంతలను నెలకొల్పాలని విప్ గాంధీ కోరారు. ఈ మేరకు బుధవారం విప్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజలలో పరిశుభ్ర పరిసరాలపై పూర్తి అవగాహన కల్పించాలని, వారి భాగస్వామ్యంతో ఆరోగ్యకర పరిసరాలను సాధించాలన్నారు. ప్రధానంగా వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
హైదర్నగర్ డివిజన్ భాగ్యనగర్ కాలనీ జాతీయ రహదారి బస్స్టాపు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన షీ టాయిలెట్ను కూకట్పల్లి జడ్సీ మమత, డీసీ ప్రశాంతి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావులతో కలసి విప్ అరెకపూడి గాంధీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు బాగున్నపుడే కాలనీలు, నగరం బాగుంటుందన్నారు. బహిరంగ మల మూత్ర విసర్జనను పూర్తిగా నిర్మూలించేందుకు సామాజిక మరగుదొడ్ల నిర్మాణాలను నియోజకవర్గవ్యాప్తంగా విస్తృతంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళల సౌకర్యం కోసం వీటి నిర్మాణాలను చేపడుతున్నామని విప్ గాంధీ అన్నారు. ఆధునీకరించి ఫ్యాన్సీ స్టోర్ను నిర్వహించుకునే వెసులుబాటు ఉండటం మహిళలకు ఉపయోగకరమన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, బ్రహ్మం, పార్టీ నేతలు దామోదర్రెడ్డి, కోనేరు ప్రసాద్, పోతుల రాజేందర్, కాశీనాథ్, అష్రాఫ్, ఖదీర్, యాసిన్, కృష్ణకుమారి, విమల, రేణుక తదితరులు పాల్గొన్నారు.