అగర్తల: తనతో ఏదైనా సమస్య ఉండే తన కారును పేల్చివేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. సామాన్యులను ఎందుకు వేధిస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలో ఈ నెల 25న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీల వైరం మరింతగా పెరిగింది. ఆదివారం టీఎంసీ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేశారు. మరోవైపు హత్యాయత్నం ఆరోపణలపై టీఎంసీ నాయకురాలు సయోని ఘోష్ను త్రిపుర పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో సోమవారం ఇరు పార్టీలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు పిలుపునిచ్చాయి. దీంతో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం త్రిపుర రాజధాని అగర్తల చేరుకున్నారు. అధికార బీజేపీపై ఆయన మండిపడ్డారు. త్రిపుర బనానా రిపబ్లిక్గా మారిందని, సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. మీడియాపైనా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. తాను అగర్తల వచ్చిన ప్రతిసారీ తన కార్యక్రమాలను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం కూడా తన ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.
మరోవైపు అగర్తలలో ఉద్రిక్తతల దృష్ట్యా సోమవారం ర్యాలీలు లేదా రోడ్షోలు నిర్వహించేందుకు బీజేపీ లేదా టీఎంసీని అనుమతించలేదని త్రిపుర పోలీసులు తెలిపారు.