మహబూబ్నగర్ : దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.