రైలు ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కేంద్రం తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో బెడ్షీట్స్, బ్లాంకెట్స్తో పాటు కర్టెయిన్లను కూడా తిరిగి అందుబాటులోకి తేనున్నారు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు కింది స్థాయి అధికారులకు జారీ చేశారు. ఇక.. ఇప్పటికే వీటిని పంపిణీ చేయడం ప్రారంభించామని అధికారులు పేర్కొంటున్నారు.
దుప్పట్లు, బ్లాంకెట్స్ ఇవ్వాలంటూ ప్రయాణికుల నుంచి తమపై తీవ్ర ఒత్తిడి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వీటి సరఫరా లేని కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి తెచ్చారని, దీంతో తిరిగి ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని రైల్వే పేర్కొంది. అయితే.. కేవలం 638 ఎంపిక చేసిన రైళ్లకే ఈ సౌలభ్యాన్ని పునరుద్ధరించామని,ఈ జాబితాలో లేని రైళ్లలో మాత్రం ప్రయాణికులే బ్లాంకెట్లు, దుప్పట్లు తెచ్చుకోవాలని రైల్వే విజ్ఞప్తి చేసింది.