కోల్కతా, జూన్ 4: ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రతిపక్షాల ప్రశ్నలు, ఆరోపణలకు సమాధానం చెప్పలేక మోదీ సర్కార్ ఎదురుదాడికి దిగుతున్నది. రైలు ప్రమాదాల్ని నివారించే ‘కవచ్’ సాంకేతిక వ్యవస్థను ఎందుకు ఏర్పాటుచేయటం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మోదీ సర్కార్ను సూటిగా ప్రశ్నించారు. ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి రాజీనామా చేయాలని టీఎంసీ ఆదివారం డిమాండ్ చేసింది. దీనిపై సమాధానం చెప్పలేక బీజేపీ ఎదురుదాడికి దిగుతున్నది. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగాయని బీజేపీ నాయకులు ట్విట్టర్లో సందేశాల్ని పోస్ట్ చేశారు.
‘సాంకేతిక వ్యవస్థను ఏర్పాటుచేయనందు వల్లే ఈ దుర్ఘటన జరిగింది. రైల్వేమంత్రిగా మమతా బెనర్జీ హయాంలో చోటుచేసుకున్న ప్రమాదాలతో దీన్ని పోల్చలేం’ అని టీఎంసీ నేత కునాల్ ఘోష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగటాన్ని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజాన్ చక్రవర్తి తప్పుబట్టారు. రైల్వే మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, రైలు దుర్ఘటనపై రాజకీయాలు చేయొద్దని బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. ‘బాలాసోర్ ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. యూపీఏ పాలనలో రైల్వే మంత్రులు తమ ట్రాక్ రికార్డును చూసుకోవాలి. వారి హయాంలో జరిగినవి బాలాసోర్ ఘటనలకు తక్కువేమీ కాదు’ అని బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవ్యా ఫైర్ అయ్యారు.