(స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభ అంతకంతకూ తగ్గిపోతున్నది. ‘అబ్కీ బార్, 400 పార్’ అంటూ 2024 లోక్సభ ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే కూటమికి 400పైచిలుకు సీట్ల కల నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అది సాకారమయ్యేలా కనిపించడంలేదు. ఈ మేరకు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరిట ఇండియాటుడే-సీఓటర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే, అధికార ఎన్డీయే కూటమికి 326 సీట్లు రావొచ్చని సర్వే అంచనా వేసింది.
విపక్ష ఇండియా కూటమికి 185 స్థానాలు వచ్చే అవకాశమున్నదన్న సర్వే.. మిగతా పార్టీలు 34-35 సీట్లకు పరిమితమవుతాయని పేర్కొంది. అయితే, ఇదే సంస్థ గత జనవరిలో చేసిన సర్వేలో ఎన్డీయేకు 352 సీట్లు రాగా, ఇప్పుడు 26 స్థానాలు తగ్గి 326 సీట్లకు పరిమితమవ్వడం గమనార్హం. పేపర్ లీకేజీలు, హొర్ముజ్ సంక్షోభం వల్ల చమురు ధరల పెరుగుదల వంటి సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొచ్చినట్టు సర్వే అభిప్రాయపడింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య 25,184 మందిపై ఈ సర్వే నిర్వహించారు.
పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా జెన్జీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ప్రజలు షాకిచ్చారు. సీజేపీ ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటేయబోమని 43 శాతం మంది తేల్చి చెప్పారు. ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని రేసులోకి వచ్చారు. విజయ్ను పీఎం అభ్యర్థిగా మూడో స్థానంలో నిలుపుతూ.. 9.2 శాతం మంది ఓటేశారు.
