BJP | హైదరాబాద్, ఏప్రిల్ 11(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ) : వారంతా దళితులు.. పైగా నిరక్షరాస్యులు.. వారిని మోసం చేయటానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? అనుకున్నారేమో.. అడ్డంగా దోపీడీకి తెరలేపారు. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ప్రాజెక్టు కోసమని ఓ కంపెనీ ఆరు మంది దళితులకు చెందిన భూమిని కొనుగోలు చేసింది. అయితే చెల్లించాల్సిన సొమ్ములో కొంత మొత్తం ఇచ్చి.. మిగతా సొమ్ముతో ఎలక్టోరల్ బాండ్లు కొన్నది. ఇవేమీ తెలియని ఆ దళిత రైతులను మాత్రం మీ సొమ్ముకు అధిక వడ్డీ వస్తుందని నమ్మించారు. మోసపోయిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఇప్పుడు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ దగా పర్వంలో సింహభాగం బీజేపీది కాగా.. మిగిలిన కొసరు భాగం శివసేన పార్టీది.
ఈ సంఘటనకు సంబంధించి దళితుల తరఫున వకాల్తా పుచ్చుకున్న న్యాయవాది గోవింద్ దఫాదా ప్రకారం పూర్తి వివరాలిలా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని అంజర్ గ్రామంలో ప్రాజెక్టు పెడుతున్నామని వెల్సన్ గ్రూప్నకు చెందిన వెల్సన్ అంజర్ సెట్ లిమిటెడ్ కంపెనీ ఆ గ్రామానికి చెందిన ఓ దళిత రైతు మన్వర్ కుటుంబాన్ని కలిసింది. వారి భూమిని తమకు విక్రయించాలని కోరింది. మన్వర్ కుటుంబంలోని ఆరుగురి పొత్తులో ఉన్న 43వేల చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని కొనటానికి కంపెనీ సిద్ధమైంది. కలెక్టర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఆ భూమికి ధర నిర్ణయించింది. గజానికి 17,500గా తేల్చింది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం దళిత రైతులకు మొత్తం భూమికి గాను రూ. 76 కోట్లు చెల్లించాలి.
అంత ధరకు తాము కొనలేమని కంపెనీ కొనుగోలును వాయిదా వేసుకున్నది. అయితే ఏడాదిలోగా ప్రక్రియ పూర్తి చేయకపోతే మళ్లీ మొదటి నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టాల్సి వస్తుందని డిప్యూటీ కలెక్టర్ మెహల్ దేశాయి రంగంలోకి దిగాడు. మొత్తం భూమిని 16.61 కోట్లకు విక్రయించేలా దళిత రైతులను ఒప్పించాడు. ముందుగా రైతులకు రూ.2.80 కోట్లను చెల్లించారు. మిగిలిన సొమ్ముతో వెల్సన్ సెజ్ లిమిటెడ్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ మహేంద్రసింగ్, ల్యాండ్ అక్విజేషన్ అధికారి విమల్ కిశోర్ జోషి, అంజర్ నగర బీజేపీ అధ్యక్షుడు డేనీ రజనీకాంత్ షా కలిసి ఎస్బీఐలో ఎలక్టోరల్ బాండ్లు కొన్నారు.
అదేమని అడిగిన రైతులను అధిక వడ్డీ వస్తుందని మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితులు తమకు ఎలక్టోరల్ బాండ్ల వల్ల కలిగే ప్రయోజనమేమిటని నిలదీశారు. రైతులకు చెల్లించాల్సిన 11.14 కోట్లలో రూ. 10 కోట్ల బాండ్లను బీజేపీ క్యాష్ చేసుకోగా.. మిగిలిన రూ.కోటీ 14వేల బాండ్లను శివసేన పార్టీ క్యాష్ చేసుకున్నది. దళిత రైతు మన్వర్ కొడుకు హరేశ్ సవకర్ ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయటకు వచ్చింది.